కాంగ్రెస్పై మా పోరాటం చాలలేదు: దేవేందర్
హైదరాబాద్, జూన్ 2 (ఆన్లైన్): కాంగ్రెస్ తప్పిదాలు, వైఫల్యాలపై తాము చేస్తున్న పోరాటం చాలలేదని, అందుకే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కొన్ని సీట్లు లభించాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవేందర్ గౌడ్ ‘ఆన్లైన్’తో అన్నారు. “కాంగ్రెస్ ఈ ప్రాంతానికి ఇంత ద్రోహం చేసి… లేని అభివృద్ధిని ప్రచారం చేసుకున్నా ఈ మాత్రం స్ధానాలు వచ్చాయి. వాస్తవానికి ఇవి కూడా రాకూడదు.
కాంగ్రెస్ దుర్మార్గాలను మేం ఇంతకాలం విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాం. కానీ ఒకటి రెండు కార్యక్రమాలను చూపి ఆ పార్టీ ప్రజలను మోసం చేయగలిగింది. మరింత పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం, దోపిడీలపై వారికి లోతైన అవగాహన కలిగించాలి. దీనిపై మా పార్టీలో చర్చిస్తాం” అని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణవాదాన్ని తిరస్కరించినట్లేనా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. “ఫలితాలకు, తెలంగాణవాదానికి సంబంధం ఉందో లేదో చూడాల్సి ఉంది. సమస్య కోణం నుంచి ఆలోచించి నిర్ణయానికి రావాలి తప్ప దానికి ఈ ఎన్నికలను కొలబద్దగా తీసుకోరాదన్నది నా అభిప్రాయం. ప్రజలు ఈ వాదాన్ని పూర్తిగా తిరస్కరించారా…వారి తీర్పునకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నదానిని అధ్యయనం చేయాలి. తెలంగాణవాదం లేనేలేదని అనలేం. మా పార్టీలో మేం ఇంకా చర్చించలేదు. అందరం సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన పేర్కొన్నారు.
Posted by telanganabyelections on June 3, 2008 at 8:55 am
Filed under: Andhrajyothy, news Papers  |
| Trackback URI